Revanth Reddy : గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు : సీఎం రేవంత్

CM Revanth Reddy participated in the ‘Jai Hind Rally’ : దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భారత సైన్యం విజయవంతంగా ‘ఆపరేషన్ సిందూర్’ను నిర్వహించిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు మేడ్చల్లోని బాచుపల్లిలో కాంగ్రెస్ ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించింది. వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు.
‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగా నెక్లెస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించామన్నారు. పాక్కు గుణపాఠం చెప్పాలని ప్రధాని మోదీకి మద్దతు తెలిపామన్నారు. నాలుగు రోజుల యుద్ధం తర్వాత ఏమి జరిగిందో తెలియదన్నారు. కానీ, యుద్ధం ఆపేశారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి యుద్ధం తానే ఆపానని ప్రకటించారని చెప్పారు. యుద్ధానికి మద్దతివ్వాలని అఖిలపక్షం నిర్వహించిన ప్రధాని మోదీ యుద్ధం ఆపే విషయంలో ఎందుకు చర్చించలేదన్నారు.
గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ చైనాను మోకాళ్లపై కూర్చోబెట్టారని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. గల్వాన్ ఘటనలో మన కర్నల్ సంతోష్ను పొట్టన పెట్టుకుంటే ఏమీ చేయలేకపోయామన్నారు. 1971లో అమెరికా అండదో పాక్ మనపై యుద్ధానికి వచ్చిందన్నారు. యుద్ధం ఆపాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఇందిరాగాంధీని బెదిరించారన్నారు. కానీ, ఆమె బెదిరింపులకు లొంగలేదన్నారు. పాకిస్థాన్ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలు చేశారని సీఎం అన్నారు.