Published On:

Government employee : పాక్‌కు గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

Government employee : పాక్‌కు గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

Government servant Arrested : భారత్‌లో విస్తరించిన పాక్ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాక్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్టు చేశారు. తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడి ఫోన్‌లో పాక్‌కు చెందిన పలు నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 

రాజస్థాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సకూర్‌ ఖాన్‌ మగళియార్‌ గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అతడు స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. తాజాగా అతడిని సీఐడీ, ఇంటెలిజెన్స్‌ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్‌ చౌధ్రీ మాట్లాడారు. సకూర్‌ ఖాన్‌పై కొన్నివారాలుగా దర్యాప్తు బృందాలు నిఘా పెట్టాయి. అతడికి పాకిస్థాన్ దౌత్య కార్యాలయంతో సంబంధాలపై సందేహాలు ఉన్నాయి. సకూర్‌ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి సమాచారం అందింది. దీంతో వాటిని ప్రశ్నించి.. నిర్ధారించుకునేందుకు అరెస్టు చేసినట్లు తెలిపారు.

 

సకూర్‌ ఖాన్‌ ఫోన్‌లో పలు పాక్ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫోన్ నంబర్ల గురించి వివరణ మాత్రం సకూర్ నుంచి రావడం లేదని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. పాకిస్థాన్‌ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అంగీకరించాడు. ఇప్పటివరకు అతడి ఫోన్‌లో ఎటువంటి మిలిటరీ సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. కొన్ని ఫైల్స్‌ను అతడు డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించారు.

 

ఇదిలా ఉండగా, సకూర్‌ ఖాన్‌ స్వస్థలం పాకిస్థాన్ సరిహద్దుల్లోని జైసల్మేర్‌ జిల్లా బరోడా గ్రామంలోని మంగళియార్‌ ధాని. ఇతడు గత రాష్ట్ర ప్రభుత్వంలో ఓ మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేయడం సంచలనంగా మారింది. సదరు మాజీ మంత్రిది కూడా ఇదే గ్రామం. దర్యాప్తు వర్గాలు మాత్రం ఎలాంటి రాజకీయ లింక్‌లపై వ్యాఖ్యలు చేయలేదు.

ఇవి కూడా చదవండి: