Published On:

South Central Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్

South Central Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్స్

Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్లపల్లి- బర్హంపూర్ మధ్య 16 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు మే 9 నుంచి జూన్ 27 వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.

 

చర్లపల్లి- బర్హంపూర్ స్పెషల్ ట్రైన్

రైలు నెంబర్ (07027) చర్లపల్లి నుంచి బర్హంపూర్ కు వెళ్లే రైలు ప్రతి శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయల్దేరుతుంది. బర్హంపూర్ కు ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ (07028) బర్హంపూర్ నుంచి చర్లపల్లి వెళ్లే రైలు బర్హంపూర్ లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 11.35 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

 

ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం, నౌపాడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

 

చర్లపల్లి- శ్రీకాకుళం స్పెషల్ ట్రైన్

మరోవైపు చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు వరకు మరో 26 ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు మే 12 నుంచి మే 25 వరకు అందుబాటులో ఉండనున్నాయి. రైలు నెంబర్ 07425 చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు వరకు మే 12 నుంచి మే 23 ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే రైలు నెంబర్ 07426 శ్రీకాకుళం రోడ్డు- చర్లపల్లి మధ్య మే 13 నుంచి మే 24 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.

 

ఇక చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు మధ్య మధ్య రైలు నడవనుంది. రైలు నెంబర్ 07421 మే 13 నుంచి మే 24 వరకు ప్రతి మంగళవారం చర్లపల్లిలో బయల్దేరుతుంది. తిరుగుప్రయాణంలో రైలు నెంబర్ 07422 శ్రీకాకుళం రోడ్డు- చర్లపల్లి మధ్య మే 14 నుంచి మే 25 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

 

ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.