Vemulawada Kode: ప్రైమ్9 ఎఫెక్ట్, రాజన్న కోడెల మృతిపై కలెక్టర్ సీరియస్

Vemulawada Kode: ప్రైమ్ 9 ఎఫెక్ట్, రాజన్న కోడెల మృతిపై కలెక్టర్ సీరియస్ప్రై మ్9 ఎఫెక్ట్తో అధికారులు కదిలారు. వేములవాడ రాజన్న గోశాలలో 8 కోడెలు మృత్యువాతపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ప్రైమ్9లో వరుస కథనాలపై కోడెల ప్రాణాలు నిలిచాయి.
తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ. ఇక్కడ పరమేశ్వరుడైన శివుడు రాజన్నగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడి గుడి ప్రత్యేకత నందీశ్వరుడిని కోడెల రూపంలో భక్తులు కొలుస్తుంటారు. అంతేకాకుండా కోడెలను స్వామివారి చుట్టూ ప్రదక్షణం చేయిస్తామని మొక్కులు మొక్కి చెల్లిస్తుంటారు. అయితే అవే కోడెలను ఆలయ అధికారులు పట్టించుకోవడంలేదు. వాటిని సరైన ఆహారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకే గోశాలలో ఏకంగా 1150 కోడెలను ఉంచుతున్నారు. గోశాల చిన్నదవడం కోడెలు ఎక్కువగా ఉండటంతో కిక్కిరిసిపోయింది. సరిగ్గా కోడెలు పడుకోవడానికి కూడా స్థలం ఉండటం లేదు.

vemulawada rajanna kodelu
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ ఝా సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో గోశాలను పశు వైద్యాధికారులు పరిశీలించారు. గోశాలలో పరిమితికి మించి 11 వందల 50 కోడెలు ఉన్నట్లు గుర్తించారు. గోశాలలో తొక్కిసలాట జరిగి కోడెలు మృతి చెందే అవకాశం ఉందన్నారు అధికారులు. భారీ వర్షాలతో అనారోగ్యం బారిన పడి మృత్యువాతకు గురై ఉండొచ్చని అంటున్నారు. కోడెలకు అవసరమైన ఆహారం కూడా అందించడం లేదన్నారు. గోశాల నిర్వహణ తీరు అధ్వానంగా ఉందంటున్నారు. గోశాల పరిసరాలు బురదమయంగా ఉండటంతో కోడెలను వేరే చోటికి మార్చారు. అనారోగ్యంతో ఉన్న కోడెలకు వైద్యం అందిస్తున్నారు.
భగవంతుని సన్నిదిలోనే అధికారులు పట్టించుకోవడం లేదంటే ప్రజలు, భక్తులు ముక్కునవేలేసుకుంటున్నారు. నోరులేని జీవాల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి ప్రాంగణంలో మొక్కే మొక్కులు సరైన నడవడిక ఉన్నవారికే చెల్లుతాయని పాపం చేసిన వారికి భవిష్యత్తు నరకమేనని అంటున్నారు. అయితే కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు కోడెలకు కావలసిన ఏర్పాట్లను చూస్తున్నారు. ఇప్పటికే ఎక్కువగా ఉన్నవాటిని వేరే గోశాలకు ( కొట్టంకు) మార్చారు. భవిష్యత్తులో ఇవి రిపీట్ కాకుండా చూడాలని ఆదేశించారు కలెక్టర్.