Published On:

POK: త్వరలోనే భారత్ లోకి పీఓకే.. మంత్రి రాజ్ నాథ్ హాట్ కామెంట్స్

POK: త్వరలోనే భారత్ లోకి పీఓకే.. మంత్రి రాజ్ నాథ్ హాట్ కామెంట్స్

Rajnath Singh: పహల్గామ్ ఘటన తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలు దాడుల వరకు వెళ్లాయి. దీంతో యుద్ధం వస్తుందని భారత్ తో పాటు, ప్రపంచ దేశాల ప్రజలు ఆందోళన చెందారు. కానీ భారత్ దెబ్బకు తోక ముడిచిన పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయినా.. పరిస్థితి మాత్రం గంభీరంగానే ఉంది.

 

ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచ దేశాల ముందు బయటపెడుతోంది. అలాగే అఖిలపక్ష ఎంపీలతో కూడిన ఏడు బృందాలను ప్రపంచ దేశాలకు పంపిన మోదీ సర్కారు.. దాయాది కుట్రలను అందరికీ తెలిసేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదేనని అన్నారు. అక్కడి ప్రజలు భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అతి త్వరలోనే పీవోకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు.

 

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలు మన కుటుంబ సభ్యులని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భౌగోళికంగా వేరు పడినా.. వారు ఎప్పటికైనా ఇండియాలో కలుస్తారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ చాలా బలంగా ఉందని చెప్పారు. పీవోకేలోని చాలా మంది ప్రజలు ఇండియాలో కలవాలని కోరుకుంటున్నారని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. కొంతమంది మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నారని వివరించారు. పీవోకే ప్రజలు ఏదో ఒక రోజు భారత్ లో ఏకమవుతారని.. ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పీవోకే దానంతట అదే వస్తుందని.. అక్కడున్న వారికి ఇండియాతో బలమైన బంధాలు ఉన్నాయని రాజ్ నాథ్ అన్నారు. పీవోకేలోని మెజార్టీ ప్రజలు భారత్ తో కలవాలని కోరుకుంటున్నారని, కొందరు మాత్రమే తప్పుడు దారిలో వెళ్తున్నారని వివరించారు. మనం ఏదైనా చేయగలమని.. అయితే శక్తితో పాటు సంయమనం కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు.