PM Modi: పాక్ ఎత్తులను చిత్తు చేశాం.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Operation Sindoor: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రికత్తలు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. దాడికి బదులు భారత్ పాకిస్తాన్ తో పలు వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. అలాగే దేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గామ్ దాడికి సమాధానంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. భారత్ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ పైకి దాడులకు దిగింది. అలాగే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడింది. పాక్ దాడులను భారత్ ధీటుగా తిప్పికొట్టింది. అలాగే పాకిస్తాన్ లోకి కీలక స్థావరాలపై భారత్ దాడులు జరిపి దాయాది దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. దీంతో పాక్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది.
తాజాగా ఆపరేషన్ సిందూర్ ప్రధాని మాట్లాడారు. మన తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ రూపంలో ధీటైన సమాధానం ఇచ్చామని అన్నారు. ఉగ్రవాదులు మనల్ని విభజించాలని చూశారని, మతం ప్రాతిపదికన పాకిస్తాన్ మనల్ని వేరు చేయాలని ప్రయత్నించిందన్నారు. కానీ మనమంతా ఐక్యంగా ఉండి దాయాదికి గట్టి బుద్ధి చెప్పామన్నారు. పాక్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశారమన్నారు.
అయితే సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నేడు వర్చువల్ గా తన సందేశాన్ని వినిపించారు. నిజానికి నేడు సిక్కిం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం కారణంగా వర్చువల్ గా సిక్కిం ప్రజలకు సందేశాన్ని పంపారు. ఈశాన్య రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. సిక్కింను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్ గా మార్చబోతున్నామని, సిక్కింను కేవలం భారత్ కే కాక, యావత్ ప్రపంచానికి గ్రీన్ మోడల్ స్టేట్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వికసిత్ భారత్.. పేదలు, రైతులు, మహిళలు, యువత అనే నాలుగు బలమైన పునాదుల మీద రూపుదిద్దుకుంటోందని చెప్పారు. సిక్కిం రైతులు వ్యవసాయంలో కొత్త ఒరవడులు సృష్టిస్తున్నారని ఇది సిక్కిం యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు.