2 BJP MLA’s Suspended: కర్నాటకలో సంచలనం.. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్
2 BJP MLA’s Suspended in Karnataka: కర్నాటక బీజేపీలో సంచలన పరిణామం నెలకొంది. పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ రాష్ట్ర అధినాయకత్వం ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ అయిన వారిలో యశ్వంతపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సోమశేఖర్, యెల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ ఉన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. అధికార కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటూ లబ్ధి పొందారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
అందులో భాగంగానే కర్నాటక బీజేపీ కోర్ కమిటీ, జాతీయ ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ దాస్ అగర్వాల్, విజయేంద్ర నేతృత్వంలో నిజనిర్ధారణ చేసేందుకు గతంలో సమావేశమయ్యారు. అయితే వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని కేంద్ర క్రమశిక్షణా కమిటీకి నివేదిక ఇచ్చారు. దీనిపై ఇరువురు నేతలకు పార్టీ నోటీసులు జారీ చేసింది. వారిపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. దీంతో ఇరువురు నేతలు పార్టీ అధిష్టానం ముందు విచారణకు వెళ్లారు. కానీ వారిచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు సోమశేఖర్, శివరాం హెబ్బర్ పై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టుగా రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.