Published On:

Monsoon: తేలిపోయిన నైరుతి.. కానరాని వర్షాలు

Monsoon: తేలిపోయిన నైరుతి.. కానరాని వర్షాలు

Telangana: దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. భారీ వర్షాలు పడతాయి. ఇక రోళ్లు పగిలేలా ఎండలు కాచే రోహిణీకార్తెలో ఈ ఏడాది వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు చెప్పిన మాటలన్నీ ఉత్తవే అయ్యాయి. తెలంగాణతో పాటు దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా మే నెలలోనే నైరుతి రుతుపవానాలు ప్రవేశించాయి. అయితే నైరుతి రుతుపవనాల ప్రభావమా, లేక బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండాల ప్రభావమో తెలయదు కానీ మే ఆఖరివారంలో భారీ వర్షాలు పడ్డాయి.

 

కానీ ప్రస్తుత వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎండల నుంచి ఉపశమనం కలిగింది.. వానలు పడతాయి అనుకున్న ప్రజలకు నిరాశే కలిగింది. భానుడి భగభగలతో.. అసలు వర్షపు మేఘాలే కనిపించడం లేదు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతోపాటు వడగాలులు సైతం విస్తున్నాయి. దీంతో ప్రజలు పగటిపూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు మందగించడంతోనే వర్షాలు ఆగిపోయాయని చెప్పింది. అందుకే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పింది. మరోవైపు తెలంగాణలో అక్కడక్కడ ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు పడుతున్నా.. అంతగా ప్రభావం లేదు. నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే వచ్చాయని ఒకటి, రెండు వానలు పడగానే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు సైతం నాటారు. కానీ ఇప్పుడు వర్షం జాడ లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.