Indian Navy: భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకలో అగ్నిప్రమాదం.. కాపాడిన నేవీ

Fire in the Arabian Sea: భారత్ నుంచి ఒమన్కు వెళ్తున్న ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న భారత నౌకాదళ సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్ సాయంతో నౌక వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన నౌకలో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నట్లు నేవీ అధికారులు తెలిపారు.
ఎంటి యీ చెంగ్ 6 అనే నౌక గుజరాత్లోని కాండ్లా నుంచి ఒమన్కు బయలు దేరింది. అందులో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నారు. మార్గమధ్యలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇంజిన్ గదిలో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర సాయం కోసం సందేశం పంపారు. సమీపంలో విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ తబర్ అప్రమత్తమైంది. బోట్లు, హెలికాప్టర్ సాయంతో అగ్నిమాపక సిబ్బంది, పరికరాలను తరలించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు చాలావరకు నియంత్రణలోకి వచ్చాయని భారత నౌకాదళం ట్వీట్ చేసింది.
ఇటీవల కేరళ తీరంలో ప్రమాదానికి గురైన ఓ కంటెయినర్ నౌకలోని సిబ్బందిని నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. అంతకుముందు అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలోని 12 మందిని కాపాడింది. పలు సందర్భాల్లో సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన వాణిజ్య నౌకల్లోని సిబ్బందిని సురక్షితంగా విడిపించింది.