Etala Rajender : కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆరే బాస్.. గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా : ఈటల రాజేందర్
BJP MP Etala Rajender : కాళేశ్వరం కమిషన్ విచారణను త్వరగా పూర్తి చేయాలని, నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఈటల అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏ పార్టీలో ఉన్న విలువలతో ఉన్నా..
ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నానని చెప్పారు. తెలంగాణలో మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానని పేర్కొన్నారు. కాళేశ్వరం రీ డిజైన్ కోసం కేసీఆర్ వేసిన సబ్ కమిటీలో తాము ఉన్నామని చెప్పారు. 2016లో తుమ్మడిహట్టి అంచనా రూ.16,500 కోట్లు అన్నారు. 2015లో రూ.38 వేల కోట్లకు పెరిగిందన్నారు.
తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం..
తుమ్మడిహట్టిపై మహారాష్ట్ర అభ్యంతరం తెలిపిందన్నారు. తుమ్మడిహట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయన్నారు. మూడు బ్యారేజీ సీడబ్ల్యూసీ రిపోర్టు, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారని తెలిపారు. సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారని పేర్కొన్నారు. కాళేశ్వరం మొదటి రూ.63వేల కోట్ల అంచనాతో ప్రారంభమైందన్నారు. రైతుల డిమాండ్ మేరకు రూ. 82వేల కోట్లకు పోయిందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని తనను అడిగారని, కాళేశ్వరం కార్పొరేషన్కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు.
కేసీఆర్, హరీశ్రావుల దగ్గర సమాచారం ఉంది..
తమ బతుకు నిబద్ధతో ఉందని, తానేమీ చేయలేదన్నారు. తనకేమీ తెలియదని, అంతా వారే చేశారని తెలిపారు. కేసీఆర్, హరీశ్రావుల దగ్గర సమాచారం ఉందన్నారు. ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుందన్నారు. ఆర్థిక శాఖకు అన్ని వివరాలు తెలియవన్నారు. ప్రాజెక్టు రీ డిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని, అందులో తాను హరీశ్రావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు ఉన్నామని చెప్పారు. తన గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడుతాని స్పష్టం చేశారు. ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెబుతానని పేర్కొన్నారు. కొందరు బట్టకాల్చి మీదేసినంత మాత్రాన తనకేమీ కాదన్నారు.
మూడు బ్యారేజీల వ్యయం రూ.10వేల కోట్లు..
మూడు బ్యారేజీల వ్యయం రూ.10వేల కోట్లపైగా ఉండొచ్చు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ రిపోర్టులను బయటపెట్టాలని కోరారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును త్వరగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానిదన్నారు. నిర్ణయం తీసుకుంది కేసీఆర్ అన్నారు ఆయనే బాస్ అన్నారు. కొన్ని వందలసార్లు తన మానస పుత్రిక అని చెప్పారని ఈటల మీడియా చిట్చాట్లో అన్నారు.