YS Jagan Serious on AP Govt.: ఏపీ సర్కార్ పై వైఎస్ జగన్ ఫైర్.. అభివృద్ధి, సంక్షేమం లేదని వ్యాఖ్య!

YS Jagan serious on AP Government: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగట్లేదని ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని.. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో డైలాగులు చెప్పారని ప్రస్తుతం వాటన్నింటిని ఆయన మర్చిపోయారని విమర్శించారు.
అభివృద్ధి మంత్రం ఉందని, సంపద సృష్టిస్తానని అన్నారు. కానీ ఇప్పుడు ఏపీలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పనితీరు దారుణంగా ఉందని కాగ్ చెబుతోందన్నారు. బాబు ముఠా చేతుల్లోకి రాష్ట్ర సంపద వెళ్తోందని ఆరోపించారు. ఐదేళ్లలో మా హయాంలో రూ. 3 లక్షల 32 వేల 671 కోట్ల అప్పు చేస్తే టీడీపీ హయాంలో ఏడాదిలోనే రూ. లక్షా 37 వేల 546 కోట్లు అప్పుచేసిందన్నారు. చంద్రబాబు అప్పుల సామ్రాట్ గా పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి అప్పులు తెస్తున్నారని విమర్శించారు. గనులు తాకట్టు పెట్టి రూ. 9వేల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. తమ హయాంలో రాష్ట్రం శ్రీలంక మారిందని తప్పుడు మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం ఏంటో తమ హయాంలో చేసి చూపించామని గుర్తు చేశారు.
కొన్ని కంపెనీలకు విశాఖలోని విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఉర్సా, లూలూ లాంటి కంపెనీలకు రూపాయికే భూములిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఇష్టారీతిన ఇసుకను దోచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అమరావతిలో టెండర్లు స్కాములకి పరాకాష్టగా మారాయని తెలిపారు. స్కాముల కోసమే మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకువచ్చారని పేర్కొన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద పది శాతం ఇస్తే అందులో 8 శాతం కమీషన్ వెళ్తుందని దుయ్యబట్టారు.
అమరావతిలో నిర్మాణాలకు అంచనాలు భారీగా పెంచారని అసహనం వ్యక్తం చేశారు. 53 లక్షల చదరపు అడుగులతో సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న సచివాలయం, అసెంబ్లీ భవనాలు గంగపాలు చేసినట్టే కదా అని ఆరోపించారు. అమరావతిలో నిర్మాణాలకు భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోందన్నారు. యాక్సిస్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఓ స్కామ్ అన్నారు. తాము సెకీతో రూ. 2.49కే ఒప్పందం చేసుకున్నామని.. కానీ యాక్సిస్ తో రూ. 2.11ఎక్కువకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. దీంతో ఏడాదికి రూ. 440 కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. లిక్కర్, మట్టి, ఇసుక మాఫియాలు ఎక్కడికక్కడ ప్రజలను దోచుకుంటున్నాయని ఆవేదన చెందారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అమరావతి కోసం ఇప్పటికే రూ. 52 వేల కోట్ల అప్పు చేశారని అన్నారు. బడ్జెట్ లోనూ రూ. 6 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇంత అప్పు ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత 12 నెలల్లో ఏపీలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి ఎగిరిపోయాయని ఎగతాళి చేశారు.
రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పాలి? మద్యం కంపెనీలకు లాభాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? చంద్రాబాబు పాలనలో లిక్కర్ కంపెనీల లాభాలు పెరిగాయని మండిపడ్డారు. తాము ట్యాక్సులు పెంచి కంపెనీలకు లాభాలు తగ్గించామని, లిక్కర్ కంపెనీలు ఎవరికి లంచాలు ఇస్తాయో ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రతి మద్యం షాపులో పర్మిట్ రూమ్ పెట్టారని అన్నారు. మద్యం అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా లేక, బెల్ట్ షాపులను రద్దు చేసి ప్రభుత్వమే అమ్మితే లంచాలు ఇస్తారా? అని నిలదీశారు. బియ్యం డోర్ డెలివరీని ఆపేసి, లిక్కర్ ను డోర్ డెలివరీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్లకు లిక్కర్ అమ్మకాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. లిక్కర్ దందాలకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి పాలసీలో లంచాలకు ఆస్కారం ఉందో ఆలోచించాలన్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీలో పారదర్శకత లేదన్నారు. 2014 నుంచి 2019 వరకు ఐదు కంపెనీలకే 69 శాతం ఆర్డర్లిచ్చరిని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క లిక్కర్ కంపెనీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన చెందారు.