World Environment Day: అమరావతిలో నేడు వన మహోత్సవం.. అధికారుల ఏర్పాట్లు

Vanamahotsavam At Amaravati: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించనుంది. అనంతవరంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం అక్కడ మొక్కలు నాటనున్నారు. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించబడుతుంది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని పచ్చని ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వనమహోత్సవం చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో కూడా అటవీ విస్తీర్ణం పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రం మొత్తం 5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొక్కలతో పర్యావరణానికి జరిగే మేలుపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.