Caste Census : కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరోసారి కులగణన

Karnataka Government : సిద్ధరామయ్య ప్రభుత్వానికి అధిష్ఠానం కీలక సూచన చేసింది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. నిర్ణీత కాలపరిమితి లోగా తిరిగి కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించింది. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ఈ 12న కర్ణాటక కేబినెట్..
సమావేశం అనంతరం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో తాజా పరిస్థితులపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. తాము చర్చించిన ప్రధాన అంశాల్లో కులగణన ఒకటి అని చెప్పారు. కులగణనపై ఈ నెల 12వ తేదీన కర్ణాటక కేబినెట్ ప్రత్యేక సమావేశమై చర్చిస్తుందని తెలిపారు. కర్ణాటక సర్కారు చేపట్టిన కులగణన విధానాన్ని తాము సూత్రప్రాయంగా ఏకీభవిస్తున్నామని చెప్పారు. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కొన్నివర్గాల్లో ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో చేపట్టిన కుల గణన సమాచారం పదేళ్ల కింద గనక నిర్ణీత కాలపరిమితి 60-80 రోజుల్లో తిరిగి చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సీఎంకు పార్టీ సూచించిందని తెలిపారు. దీనిపై సిద్ధరామయ్య మరిన్ని వివరాలను అందిస్తారని చెప్పారు.
సమావేశంలో కర్ణాటకలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చర్చించినట్లు తెలిపారు. తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేతలకు సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ వివరించారని తెలిపారు. ప్రతిఒక్కరి ప్రాణాన్ని తమ పార్టీ ఎంతో విలువైనదిగా భావిస్తుందన్నారు. దురదృష్టకర ఘటనలో ఏం జరిగిందో స్పష్టంగా తెలుసుకొనేందుకు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. ప్రజానుకూల వైఖరితో తమ పార్టీ ఉంటుందన్నారు. కేంద్రం కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కర్ణాటక పట్ల కేంద్రం తీరు ఆమోద యోగ్యం కాదన్నారు.
2015లో కర్ణాటక వెనుకబడినవర్గాల కమిషన్ జస్టిస్ కాంతరాజ నేతృత్వంలో కులగణన చేపట్టింది. డేటా ఆధారంగా కె.జయప్రకాశ్ హెగ్డే నేతృత్వంలో పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి గతేడాది ప్రభుత్వానికి సమర్పించింది. కులగణన, ఆర్థిక, సామాజిక సమీక్షపై రూపొందించిన నివేదికను కర్ణాటక ప్రభుత్వం గతంలో ఆమోదించింది. నిపుణులు రూపొందించిన నివేదికపై పలువర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తాజా నిర్ణయం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.