Published On:

CM Chandrababu: మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత.. ఏపీ సీఎం చంద్రబాబు

CM Chandrababu: మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత.. ఏపీ సీఎం చంద్రబాబు

World Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు మొక్కలు నాటారు. ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎం, డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ, అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

 

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి మొక్కల విలువ తెలియదని విమర్శించారు. జగన్ హెలికాప్టర్ వస్తే కింద చెట్లు నరికేవారని ఆరోపించారు. కేవలం ఫోటోల కోసమే గతంలో మొక్కలు నాటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎర్రచందనంతో పాటు ఔషధ మొక్కలకు నల్లమల అడవి కేంద్రంగా ఉందన్నారు. కానీ నల్లమల అడవుల్లో తరచూ అగ్నిప్రమాదాలతో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి సవాల్ గా మారిందని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించి గ్లోబల్ వార్మింగ్ నియంత్రించాలని కోరారు. రాష్ట్రంలో ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వనమహోత్సవం అమరావతిలో చరిత్ర సృష్టిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో 30 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలని సీఎం అన్నారు.

రాష్ట్రంలో ప్లాస్టిక్ పొల్యుషన్ ను పూర్తిగా నియంత్రించాలని తెలిపారు. వ్యక్తుల నక్షత్రాలను బట్టి మొక్కల గింజలతో రాఖీలు తయారు చేశామని చెప్పారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక బంపర్ హిట్ అని అభిప్రాయపడ్డారు. ఏపీలో చరిత్ర సృష్టించి నిన్నటికి ఏడాది పూర్తయిందని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. అన్ని మతాలు, ధర్మాలు ప్రకృతిని పరిరక్షించాలని చెప్పాయని పేర్కొన్నారు. దేవతల రాజధాని అమరావతి అని, అలాంటిది రాష్ట్ర రాజధానిగా ఉన్న అమరావతి భవిష్యత్తులో బ్లూ-గ్రీన్ సిటీగా ఏర్పాడుతుందని చెప్పారు. చైనా, జపాన్ తరహాలో అమరావతిలో కూడా మొక్కల పెంపకం చేస్తామన్నారు. రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరెంట్ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ రావాలి పొల్యుషన్ కంట్రోల్ కావాలన్నారు.