DSC Exams: రేపటి నుంచే మెగా డీఎస్సీ ఎగ్జామ్స్.. అమల్లో ఒక్క నిమిషం రూల్
AP Mega DSC Exams: రేపటి నుంచి ప్రారంభమయ్యే మెగా డీఎస్సీ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఆన్ లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కాగా డీఎస్సీ పరీక్షల కోసం మొత్తం 154 కేంద్రాలను సిద్ధం చేశారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్థులు 90 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
మెగా డీఎస్సీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 35 వేల 401 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి 5 లక్షల 77 వేల 417 అప్లికేషన్లు సమర్పించారు. కాగా ఇప్పటి వరకు 3.04 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16 వేల 347 టీచర్ పోస్టులను పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే 421 పోస్టులను స్పోర్ట్ కోటా కింద నియామకాలు చేయనున్నారు. వీరికి క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా శాప్ ఇచ్చే జాబితాతో పాఠశాల విద్యాశాఖ ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ కోటా కింద పరీక్ష ఉండదు.
అభ్యర్థులు హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డు వివరాలు పరీక్ష కేంద్రం వద్ద సమర్పించాలని సూచించారు. ఎవరికైనా హల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో లేకపోతే.. అటువంటి వారు పరీక్ష కేంద్రానికి రెండు ఫోటోలు తీసుకురావాలని తెలిపారు. హాల్ టికెట్ లో తప్పులు ఉంటే ఫోటో అవసరం లేదన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి కేవలం హాల్ టికెట్, గుర్తింపు కార్డు వంటివి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దృష్టి లోపం ఉన్నవారు, రెండు చేతులు లేని వారు పరీక్ష రాసేందుకు పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేశారు. అలాంటి వారి కోసం 2.30 గంటలు పరీక్ష ఉంటుందని అధికారులు చెప్పారు. దివ్యాంగులకు మరో 50 నిమిషాలు అదనంగా సమయం కేటాయించనున్నారు.