Yoga Day: నేటి నుంచి యోగాంధ్ర.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఏపీ సర్కార్

AP: జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబంధించి.. నేటి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. నెలరోజులపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామని జూన్ 21న విశాఖ బీచ్ లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.
కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని అన్నారు. యోగా ప్రాముఖ్యత అన్ని దేశాలకు చాటి చెప్పారని కితాబిచ్చారు. కాగా జూన్ 21న విశాఖలో ఐదు లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇది ప్రపంచ రికార్డు కానుందని తెలిపారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్పు కానుక యోగా అని పేర్కొన్నారు.
జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే యోగా తప్పనిసరి అని సూచించారు. యోగాతో పాజిటీవ్ థింకింగ్ కలుగుతుందన్నారు. ప్రతిరోజు ప్రాణాయామం, యోగా చేయాలని కోరారు. నేటి నుంచి ఏపీ మొత్తం యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్, పతాంజలి, బ్రహ్మకుమారీలను కలుపుకుని వెళ్తామన్నారు. ప్రతీ ఒక్కరూ యోగా లో పాల్గొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరారు. యోగాంధ్ర కోసం రిజిస్ట్రేషన్ యాప్ ను ప్రారంభించామని సీఎం చంద్రబాబు చెప్పారు.