Honeymoon Murder : రాజా రఘువంశీ భార్య సోనమ్కు 8 రోజుల పోలీస్ కస్టడీ
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశంలో సంచలనం సృష్టించింది. కేసులో పోలీసులు నిందితురాలు, మృతుడు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీతోపాటు ఐదుగురు నిందితులను షిల్లాంగ్ కోర్టులో హాజరుపర్చారు. వీరిని ట్రాన్సిట్ రిమాండ్పై తీసుకువచ్చారు.
కోర్టులో హాజరుపర్చిన తర్వాత ఇరువైపులా న్యాయస్థానం వాదనలు విని, నిందితులకు 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తోంది. మే 11వ తేదీన అతడికి సోనమ్తో పెళ్లి జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అనంతరం కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు.
అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనమ్ కోసం గాలించారు. ఉత్తర్ప్రదేశ్లోని గాజీపుర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తర్వాత ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యలో తన ప్రమేయం ఉందని సోనమ్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు సిట్ వర్గాలు వెల్లడించాయి. అనంతరం నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా, 8 రోజుల రిమాండ్ విధించింది.