Merchant Charges : యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు : కేంద్రం

UPI Payments : యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. కిరాణా షాపుల్లో చిన్న వస్తువులను కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా పేమెంట్స్పై ఎటువంటి ఛార్జీలు లేవు. త్వరలో లావాదేవీలపైన మర్చంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై కేంద్రం స్పందించింది. అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టి పారేసింది.
అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటూ పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో వీటికి సహకరించాలనే లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా, లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నాయని, యూపీఐ ద్వారా రూ.3,000కు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో కేంద్రం ఉందనేది వార్తల సారాంశం. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఐ వంటి వాటాదారులతో సంప్రదింపుల అనంతరం ఒకటి లేదా రెండు నెలల్లో యూపీఐ లావాదేవీలపై రుసుము విధించే విషయంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఈ రోజు ఉదయం వార్తలు వచ్చాయి.
అలాంటిదేమీ లేదంటూ కేంద్రం ఖండించింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వసూలు చేస్తారంటూ వచ్చిన వార్తలు పూర్తి ఊహాజనితమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తప్పుదారి పట్టించేదిగా ఉందని తెలిపింది. నిరాధారమైన, సంచలనం సృష్టించే ఊహాగానాలు పౌరుల్లో అనవసరమైన అనిశ్చితి, భయాందోళనలకు కారణమవుతాయంటూ ఎక్స్లో పేర్కొంది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపింది.