Air India flight : కూలిన విమానం.. కోటి ఆశలతో భర్తను కలిసేందుకు లండన్కు.. నవవధువు కలలు ఆవిరి

Ahmedabad : అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో మంది కలలను చిదిమేసింది. నూరేళ్లు తన భర్తతో జీవితం గడపాలని ఆశపడిన ఓ నవ వధువు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లండన్లో ఉన్న తన భర్తను మొదటిసారి కలిసేందుకు వెళ్లిన నవ వధువు జాడ తెలియక తన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
రాజస్థాన్కు చెందిన ఖుష్బూకు ఇటీవల పెళ్లి అయ్యింది. ఆమె భర్త లండన్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. తొలిసారి భర్తను కలిసేందుకు ఆమె బయలుదేరింది. ఈ క్రమంలో విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నవ వధువు మృతిచెంది ఉండే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె జాడ తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సరదా మాట నిజమైంది..
బ్రిటన్ జాతీయులు ఇద్దరు ఇటీవల గుజరాత్ పర్యటనకు వచ్చారు. ఇక్కడి ఎన్నో జ్ఞాపకాలను వెంట తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొద్ది సేపట్లో లండన్కు విమానం బయలుదేరే సమయంలో ఇన్స్టాగ్రామ్లో ఎమోషన్ పోస్టు పెట్టారు. ఇండియా పర్యటన ఎంతో బాగుందని, ఇక్కడ ఉన్నంత కాలం ఎన్నో సరదా క్షణాలు గడిపామని పోస్టు పెట్టారు. మరికొన్ని గంటల్లో భారత్ను విడిచి వెళ్లడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇదే తమకు చివరి రాత్రి. గుడ్బై ఇండియా అంటూ పోస్టు పెట్టారు. ప్రమాదం తర్వాత వీరు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మన దేశంపై ఎంతో ఇష్టం పెంచుకున్నారని, ప్రమాదం జరగడం ఎంతో బాధేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేశారు.
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పెను విషాదం నింపింది. 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న విమానం ప్రమాదానికి గురి కావడంపై ప్రపంచ దేశాధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.