Tata group : ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం : టాటా సన్స్ చైర్మన్
Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటా గ్రూప్ స్పందించింది. మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. బాధను వ్యక్తపర్చడానికి మాటలు కూడా రావడం లేదని పేర్కొన్నారు. ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ తరఫున రూ.కోటి అందజేయనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తాన్నారు. వారి సంరక్షణ బాధ్యత తమదే అన్నారు. బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఘటనపై ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్బెల్ విల్సన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.