Published On:

SRH won the Match: సన్ రైజర్స్ హవా.. కోల్ కత్తా చిత్తు

SRH won the Match: సన్ రైజర్స్ హవా.. కోల్ కత్తా చిత్తు

SRH Beats KKR with 110 Runs: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఏకపక్షంగా జరిగింది. బ్యాటింగ్ లో హైదరాబాదీ ప్లేయర్లు శివలెత్తగా.. బౌలింగ్ లోనూ కోల్ కత్తాను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో సన్ రైజర్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ లో 110 పరుగుల భారీ తేడాతో విజయంతో టోర్నీకి గుడ్ బై చెప్పింది. కానీ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైనా.. ఫ్యాన్స్ మనసులను గెలుచుకుంది. సీజన్ ప్రారంభం తొలి మ్యాచ్ లోనే ఐపీఎల్ హిస్టరీలోనే రెండో అత్యధిక స్కోర్ 286/6 చేసిన కమిన్స్ సేన ఆఖరి పోరులో ఐపీఎల్ సీజన్ లో మూడో అతిపెద్ద స్కోర్ 278/3 వికెట్లతో సూపర్ ఫినిషింగ్ ఇచ్చింది.

 

గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్.. ఈ ఏడాది ఆరోస్థానంలో నిలిచింది. కాగా ఢిల్లీ వేదికగా కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఒకరిని మించి ఇంకొకరు పోటీపడి మరి బౌండరీలు బాదారు. క్లాసెన్ మెరుపు సెంచరీకి తోడు హెడ్ హాఫ్ సెంచరీ.. మిగతా బ్యాటర్లు రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. అయితే హైదరాబాద్ నిర్దేశించిన కొండంత లక్ష్యఛేదనలో భాగంగా కోల్ కత్తా 18.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. మనీష్ పాండే (23 బంతుల్లో 37), హర్షిత్ రాణా (21 బంతుల్లో 34 పరుగులు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాదీ బౌలర్లలో హర్ష్ దూబే, ఉనాద్కట్ చెరో మూడు వికెట్లు, ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశారు. కాగా క్లాసెన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

 

సన్ రైజర్స్ నర్దేశించిన భారీ టార్గెట్ ఛేదనలో కోల్ కత్తా ఏ దశలోనూ హైదరాబాద్ కు పోటీ ఇవ్వలేదు. వరుసగా వికెట్లను తీస్తూ సన్ రైజర్స్ బౌలర్లు కోల్ కత్తాను కట్టడి చేశారు. ఓపెనర్ సునీల్ నరైన్ (31) కాసేపు మెరుపులు మెరిపించాడు. అనంతరం బౌలింగ్ చేసిన ఉనద్కత్ వికెట్లు తీస్తూ కేకేఆర్ పతనాన్ని ప్రారంభించారు. తర్వాత అజింక్యా రహానే (15) ను వెనక్కి పంపగా.. డీకాక్ (9) ను ఎషాన్ మలింగ ఔట్ చేశాడు. అనంతరం బౌలింగ్ కు వచ్చిన హర్ష్ దూబే వరుస బంతుల్లో రింకూసింగ్ (9), ఆండ్రీ రస్సెల్ (0)ను ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రఘువంశీ కూడా (14) వెంటనే ఔటయ్యాడు. తర్వాత రమణ్ దీప్ (13) ను హర్ష్ దూబే బౌల్డ్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన మనీష్ పాండే, హర్షిత్ రాణా చేసిన పోరాటం కోల్ కత్తా జట్టుకు కొంత ఉపశమనం కలిగించింది కానీ.. ఓటమిని తప్పించుకోలేక పోయారు. చివరికి వారు కూడా ఔటవ్వడంతో సన్ రైజర్స్ 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.