India-Pakistan : ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచానికి తెలుసు.. పాక్పై ఇండియా మండిపాటు

India-Pakistan : ఇండియా పొరుగు దేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్థాన్ న్యూఢిల్లీపై మరోసారి నోరు పారేసుకుంది. ఈ విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసు అని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. పాక్ ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులుగా తమ అంతర్గత సమస్యలపై దృష్టిసారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
బలోచిస్థాన్లో జరిగిన రైలు హైజాక్ ఘటనపై పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఇండియాపై అక్కసు వెళ్లగక్కారు. ఇండియా తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేశారు. పొరుగుదేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తూ ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందన్నారు. గతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఏ అఘాయిత్యానికి పాల్పడినా ఇండియా వైపు చూపించేవారని, ఇప్పుడు పాకిస్థాన్ విదేశీ విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు షఫ్ఖత్ అలీఖాన్ ఈ విధంగా స్పందించారు.
పాకిస్థాన్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు. ఇండియా మీడియ ఒకవిధంగా బీఎల్ఏను కీర్తిస్తోందని, ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ఆ దేశ విధానాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. సుమారు 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తన్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వేర్పాటువాదులు బోలన్ ప్రాంతంలో మంగళవారం హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఘటనలో వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు 33 మందిని హతమార్చినట్లు పాక్ సైన్యం పేర్కొంది.
ఇతర దేశాలపై నిందలు వేయడం సరికాదు : అఫ్గానిస్థాన్
రైలు హైజాక్ వెనుక అఫ్గానిస్థాన్ హస్తం ఉందనేందుకు తమవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. పాకిస్థాన్ బాధ్యతారహిత వ్యాఖ్యలు వారి దిగజారుడు విధానాలకు నిదర్శనమన్నారు. తమ సమస్యలను పరిష్కరించుకోలేని పాక్ ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికింది.