Tummala on Rythu Bharosa: అనుకున్న సమయానికే రైతుభరోసా నిధులు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Minister Tummala Nageswara Rao on Rythu Bharosa: త్వరలోనే అన్నదాతలకు మంచి రోజులు రాబోతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని తెలిపారు. ఆర్థిక సమస్యను అధిగమించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రుణమాఫీ చేశారన్నారు. గతేడాది ఖరీఫ్ పంట కాలంలో రైతుల ఖాతాల్లో రూ.33 వేల కోట్లు జమ చేసినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. నల్లగొండ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం తుది దశకు చేరుకుందని, త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు.
పంట నష్ట పరిహారం రూ.51 కోట్లు విడుదల..
తెలంగాణలో ఇటీవల కురిసిన వడగళ్ల వానలకు పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 5,528 ఎకరాల్లో పంటలు నష్టపోయాయని అధికారులు గుర్తించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం బుధవారం రూ.51.528 కోట్ల నిధులు మంజూరు చేసింది.
త్వరలో నష్టపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, ప్రత్తి 4,753 ఎకరాలు, ఇతర పంటలు 477 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.