HC Notice to Jhansi Reddy: ఝాన్సీరెడ్డికి బిగ్షాక్.. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్తకు హైకోర్టు షోకాజ్ నోటీసులు

High Court Notice to Jhansi Reddy: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితోపాటు ఆమె భర్త రాజేందర్రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరులో 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీరెడ్డికి పాస్బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ విషయంలో విచారణ పూర్తిచేసి నివేదికను అందించాలని ఈడీ జాయింట్ డైరెక్టర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి ఝాన్సీరెడ్డి అత్త. ప్రస్తుతం ఆమె పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేయాలని ఝాన్సీరెడ్డి భావించారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఝాన్సీరెడ్డిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేసింది. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై వివాదం చెలరేగింది.
ఝాన్సీరెడ్డి ఎన్ఆర్ఐ పౌరసత్వం కారణంగా సమస్యలు వస్తాయని భావించి కోడలు యశస్వినీరెడ్డిని బరిలోకి దింపారు. ఎర్రబెల్లిపై ఆమె ఘన విజయం సాధించారు. చాలా ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లిన ఝాన్సీరెడ్డి అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) ఫౌండర్ ప్రెసిడెంట్, అడ్వయిజరీ చైర్గా వ్యవహరించారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోపాటు పలు బిజినెజ్లు చేశారు. అనంతరం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలకు చాలా కాలం కింద స్వగ్రామం పాలకుర్తికి వచ్చిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మన్నలు పొందారు.