Published On:

RCB : ఆర్సీబీ, కేఎస్‌సీఏపై కేసు నమోదు

RCB : ఆర్సీబీ, కేఎస్‌సీఏపై కేసు నమోదు

Bengaluru Stampede : ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో 11మంది మృతి చెందారు. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఘటనపై బెంగళూరులోని కబ్బన్‌ పార్కు పోలీసులు సుమోటోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆర్‌సీబీ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ)తోపాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నేరపూరిత నిర్లక్ష్యం కేసులో సంస్థలను నిందితులుగా పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితలోని ఐదు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

కేసు విచారణ సీఐడీకి..
మరోవైపు కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు కర్ణాటక సర్కారు తెలిపింది. కోర్టుకు ఇచ్చిన స్టేటస్‌ రిపోర్టులో విషయాన్ని సర్కారు పేర్కొంది. సిట్‌ కేసును దర్యాప్తు చేస్తుందని తెలిపింది. తదుపరి దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలతోపాటు ఎఫ్‌ఐఆర్‌ కాపీని సీఐడీకి అప్పగించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణ జరుపుతున్నట్లు సర్కారు ప్రకటించింది. తొక్కిసలాటకు కారణాలేంటి? తలెత్తిన లోపాలు, జవాబుదారీతనం వంటి అంశాలను పరిశీలించేందుకు డిప్యూటీ కమిషనర్‌, బెంగళూరు డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ 15 రోజుల్లోగా విచారణ చేస్తారని సర్కారు తెలిపింది.

 

మైదానం వద్ద 2.5లక్షల మంది ప్రజలు గుమిగూడారని, బెంగళూరు నగర పోలీసుల నుంచి 1380 మంది సిబ్బంది, 13 కేఎస్‌ఆర్‌పీ ప్లాటూన్లు (325 మంది సిబ్బంది)ని మోహరించి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. అభిమానులు భారీగా తరలిరావడంతో పలు గేట్ల వద్ద తొక్కిసలాట జరిగి 11మంది మృతిచెందారు. 56మంది గాయపడ్డారని తెలిపింది. 1, 6, 7, 17-21 గేట్ల వద్ద బాగా ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. క్షతగాత్రు వెంటనే వైద్యం అందించామని తెలిపింది. 50మంది అవుట్‌ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని, మరో ఆరుగురికి చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొంది.

 

మైదానం వద్ద పోలీస్‌ సిబ్బందితో పాటు మూడు అగ్నిమాపక వాహనాలు, రెండు అంబులెన్స్‌లు, రెండు డి-శ్వాట్‌ యూనిట్లు, నీటి ట్యాంకర్‌, కమాండ్‌ కంట్రోల్‌ వాహనం మోహరించినట్లు సర్కారు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నింటినీ భరించినట్లు తెలిపింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) సైతం మృతులకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: