Wrong injection : ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. ఆరు నిండు ప్రాణాలు బలి
Odisha : ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆరు నిండు ప్రాణాలు పోయాయి. చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో గల సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆసుపత్రి ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారు. వాళ్లు మృతిచెందడానికి కొన్ని నిమిషాల ముందు సిబ్బంది రెండో రౌండ్ ఇంజెక్షన్లు వేసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అర్ధరాత్రి ఓ నర్సు వచ్చి తమ పక్కన ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్ ఇచ్చారని, తమ సోదరికి కూడా ఇచ్చారని తెలిపారు. తర్వాత కొన్ని క్షణాలకే అందరూ నొప్పితో విలవిల్లాడుతూ మృతిచెందారని ఓ మృతురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనపై ఆందోళన కొనసాగుతుండగా, మరో రోగి మృతిచెందాడు. బుధవారం ఉదయం ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో రోగికి ఇంజెక్షన్ ఇచ్చారని, కొద్దిసేపటికే రోగి కూడా మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 6కు చేరిందని రోగుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. చనిపోయిన రోగులు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారని, సర్జరీ తర్వాత ఆరోగ్యం మెరుగ్గా ఉందని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంజెక్షన్ డోసు ఇచ్చిన తర్వాతే రోగుల ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోస్టుమార్టం తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించలేదు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేతలు వైద్య కళాశాల వద్ద ధర్నా చేపట్టారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.