Published On:

Supreme Court on Sri Lankan’s: భారత్ ధర్మశాల కాదు, శరణార్థులకు ఆశ్రయం కల్పించలేం!

Supreme Court on Sri Lankan’s: భారత్ ధర్మశాల కాదు, శరణార్థులకు ఆశ్రయం కల్పించలేం!

 

  • భారత్‌ ధర్మశాల కాదు 
  • శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేం 
  • వివిధ దేశాల శరణార్థులకు భారత్‌ ఆశ్రయం ఇవ్వలేదు
  • శ్రీలంక శరణార్థుల పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • శరణార్థులు తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశం

 

India not a Dharamshala Supreme Court Rejects Sri Lankan’s Plea: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్‌ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంకకు చెందిన వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ సెటిల్‌ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం ప్రశ్నించింది.  ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలా?.. ఇప్పటికే భారత్ లో 140 కోట్ల మంది జనాభా ఉందని… అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్‌ ధర్మశాల కాదు సుప్రీకోర్టు స్పష్టం చేసింది.

 

 

నిషేధిత సంస్థ లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్ ఈలంతో సంబంధాలున్నాయని ఆరోపణలతో 2015లో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతడిని దోషి తేలుస్తూ 10 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. అనంతరం ఆ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

 

 

తాను చట్టబద్ధమైన వీసాపైనే భారత్‌కు వచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని సుప్రీకోర్టును కోరాడు. అంతేగాక, తన భార్యాపిల్లలు ఈ దేశంలోనే సెటిల్‌ అయ్యారని తెలిపాడు. తనకు ఇక్కడే ఆశ్రయం కల్పించాలని సుప్రీకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలా? అని ప్రశ్నించింది. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. శ్రీలంకలో అతడి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. అలాగైతే మరో దేశానికి వెళ్లండని సుప్రీంకోర్టు సూచించింది.