Published On:

Turkey: టర్కీకి భారత్ మరో ఝలక్… ఎయిర్ లైన్స్ ఒప్పందాలు రద్దు

Turkey: టర్కీకి భారత్ మరో ఝలక్… ఎయిర్ లైన్స్ ఒప్పందాలు రద్దు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేడి టర్కీకి బాగానే తగులుతోంది. దాయాది పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తోంది. భారత్ నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. తాజాగా టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఇండిగో చేసుకున్న లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లో ముగించాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్ కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల తర్వాత టర్కీకి మరో దెబ్బ తలిగేలా చేసింది కేంద్రం.

 

ఇండిగో ‘డమ్ప్ లీజు’ ఒప్పందాన్ని ఆగస్టు 31 నాటికి రద్దు చేస్తామని ఆ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ప్రస్తుతం ఇండిగో టర్కిష్ ఎయిర్ లైన్స్ నుంచి డంప్ లీజుకు రెండు బోయింగ్ 777- 300ఈఆర్ విమానాలను తీసుకుని ఢిల్లీ, ముంబై నుంచి ఇస్తాంబుల్ కు విమానాలను నడుపుతోంది. వాస్తవానికి ఈ లీజు గడువు మే 31న ముగియాల్సి ఉండగా, ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ దానిని మరో మూడు నెలలు పొడిగించింది. ఈ లీజును 6 నెలలు పొడిగించాలని ఇండిగో కోరింది. కానీ డీజీసీఏ దానిని తిరస్కరించింది. తదుపరి పొడిగింపు ఇవ్వబడదని, ఇది చివరి అవకాశం అని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.

 

పాకిస్తాన్ పై, ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేయడాన్ని టర్కీ ఇటీవల విమర్శించింది. దీని కారణంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో బీసీఏఎస్ టర్కిష్ కంపెనీ సెలెబి ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ భద్రతా అనుమతిని కూడా రద్దు చేసింది. ఇది మాత్రమే కాదు, అనేక ట్రావెల్ ఏజెన్సీలు, ఆన్ లైన్ ట్రావెల్ ప్లాట్ ఫామ్ లు కూడా టర్కీకి ప్రయాణించవద్దని సూచించాయి.