Bangladesh Trade Issue: దారికొస్తున్న బంగ్లాదేశ్.. భారత్ తో చర్చలకు రెడీ

Bangladesh Ready to discuss with India about Trade Issue : భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్ కు బుద్దివచ్చినట్టు కనిపిస్తోంది. చెప్పుడు మాటలు నమ్మి ఇండియాతో వివాదానికి దిగింది. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలతో కాళ్లబేరానికి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఉన్నప్పుడు భారత్ తో సంబంధాలు మంచిగానే కొనసాగాయి. కానీ బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. అలాగే భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో బంగ్లాదేశ్ దాయాది దేశానికి మద్దతు ప్రకటించింది. అలాగే పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ దాడులు చేస్తే తాము యుద్ధానికి దిగుతామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ చర్యలకు భారత్ ప్రతిచర్యలకు దిగడంతో ఇప్పుడు కాళ్లబేరానికి వస్తోంది. భారత్ తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపింది.
ఈ మేరకు బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ మాట్లాడారు. “భారత్ తీసుకున్న చర్యలకు సంబంధించి అధికారిక సమాచారం అందలేదు. అధికారిక సమాచారం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకుంటాం. అఖౌరా, డాకి పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్టు మీడియా ద్వారా తెలిసింది. ఇది ఇరు దేశాలకు సంబంధించిన వాణిజ్య వ్యవహారం. వస్త్ర పరిశ్రమలో భారత్ అగ్రస్థానంలో ఉందని మేం భావిస్తున్నాం. అయినప్పటికీ.. అయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఇది మా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. భారత్- బంగ్లా పొరుగుదేశాలు. వాణిజ్యం, రవాణా రంగాల్లో కచ్చితంగా పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు మేం పరిమితులు విధిస్తాం. భారత్ కూడా అలాగే చేస్తోంది. ఇదంతా వాణిజ్య ప్రక్రియ. ఇందులో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇరు దేశాలు చర్చలతో పరిష్కరించుకుంటాయి.” అని చెప్పుకొచ్చారు.
కొద్దిరోజులుగా బంగ్లాదేశ్.. భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్న సరుకులపై ఆ దేశం ఆంక్షలు పెట్టింది. దీంతో బంగ్లాదేశ్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అయితే బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే చేపలు, ఎల్పీజీ, వనస్పతి, కంకర వంటి ఉత్పత్తులకు ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.