Sheikh Hasina : బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో నేరాభియోగం నమోదు

Prosecutors file another criminal charge against former Bangladesh Prime Minister Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు చేశారు. సామాన్య ప్రజలపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని హసీనా క్రూరంగా అణచివేయాలని చూసినట్లు పేర్కొన్నారు.
భద్రతా దళాలు, తన పార్టీ సభ్యులు ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని హసీనా ఆదేశించినట్లు గుర్తించినట్లు తెలిపారు. నేరాభియోగానికి సంబంధించిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు, వీడియో ఆధారాలు ఉన్నాయని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం ఆదివారం తెలిపారు. దీనికి 81 మందిని సాక్షులుగా ఉన్నారని చెప్పారు. దేశంలో సంక్షోభ సమస్యతో భద్రతా దళాలు తీసుకున్న చర్యలకు నాటి దేశాధినేతగా హసీనాదే బాధ్యత అని తాజుల్ అన్నారు. హసీనా చేపట్టిన అణచివేత కార్యక్రమంలో 1500 మంది మృతిచెందారు. 25,000 మంది గాయపడ్డారు.
గతేడాది బంగ్లాలో అల్లర్లు చెలరేగడంతో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దాదాపు 15 ఏళ్లపాటు దేశాన్ని పాలించారు. గత ఆగస్టులో ఆమె ఢాకాను వీడి న్యూఢిల్లీకి చేరుకున్నారు. నాటి నుంచి హసీనా అక్కడే ఆశ్రయం పొందారు. బంగ్లాలో ప్రధాన సలహాదారుగా యూనస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం వరుసగా షేక్ హసీనాపై కేసులను బనాయిస్తోంది. హసీనా కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఆమైపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.