Last Updated:

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై విచార‌ణ మ‌రోసారి వాయిదా

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై విచార‌ణ మ‌రోసారి వాయిదా

Supreme Court : తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించలేదన్నారు. నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఓ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎలక్షన్‌లో పోటీ చేసి ఓడిపోయారని, ఆ తర్వాత కూడా బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నామంటున్నారని చెప్పారు.

 

 

ఫిర్యాదులపై ఏం చేస్తారో.. నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. అయినా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వలేదన్నారు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారన్నారు. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని, ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఇప్పటికీ మూడు వారాలైందని తెలిపారు. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదన్నారు. తాము ఫిర్యాదు చేసి ఏడాది అయినా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని సుందరం తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి జస్టిస్ గవాయ్ స్పందించారు. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని వ్యాఖ్యానించారు.

 

 

ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని పేర్కొంది. అలాంటప్పుడు ఈ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది. పిటిషనర్ల వాదనలు ముగియడంతో విచారణను సుప్రీంకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి: