Published On:

Komatireddy Venkata Reddy: కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెర: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్!

Komatireddy Venkata Reddy: కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెర: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్!

Minister Komatireddy hot Comments on KCR Family: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించాయి. అది ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని రెండు పార్టీలు తేల్చేశాయి. ఈలోపు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ కలకలం రేపింది.

 

కవిత లేఖ ఉత్తదే..

లేఖపై కవిత లేఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెరలేపిందని దుయ్యబట్టారు. కవిత లేఖ ఉత్తదేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా?. బీజేపీపై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తదా?. కేటీఆర్ హరీశ్‌రావులే లేఖ తయారు చేయించారని ఆరోపించారు. కవిత పేరుతో బయటకు వదిలారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయడం ఖాయమన్నారు. లేఖతోనే బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందన్నారు. వరంగల్ సభతో బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయిందని, అందుకే ఈ డ్రామాలు అన్నారు.

 

మరోవైపు కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ కీలక నేతలు స్పందించేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత లేఖపై స్పందించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నేత హరీశ్‌రావును మీడియా కోరగా, ఇద్దరూ స్పందించలేదు. ఓ ప్రోగ్రామ్‌కు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మైక్‌ను పక్కకు తోసివేయగా, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాత్రం కవిత లేఖపై త్వరలో స్పందిస్తామంటూ అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్లిపోయారు.

 

ఏప్రిల్ 27వ తేదీన వరంగల్‌ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ విజయవంతం అయ్యిదంటూనే.. సభ కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయిందంటూ కొన్ని ప్రతికూల పాయింట్లను కవిత లేఖలో ప్రస్తావించినట్లు నోట్‌ ఒకటి తెరపైకి వచ్చింది. బీజేపీ గురించి తక్కువ మాట్లాడేసరికి పొత్తు ఉండబోతుందనే ప్రచారం బలంగా సాగుతోందంటూ అందులో వివరణాత్మకంగా రాసి ఉంది.

 

బీజేపీపై కేసీఆర్ రెండు నిమిషాలు మాట్లాడటంతో భవిష్యత్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీ పార్టీతో ఇబ్బంది పడిన తాను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నానని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ తమకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పోటీ చేయకపోవడంతో బీజేపీకి తాము సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని, అయితే ఆ నోట్‌ ఆమె రాసిందేనా? అనేదానిపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

కవిత లేఖపై అనుమానాలు : డీకే అరుణ

కేసీఆర్‌కు కవిత లేఖ లేఖ రాయాల్సిన అవసరం ఏముందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. అసలు లేఖ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: