Update on AP DSC: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ: పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

Update on AP DSC: ఏపీలో డీఎస్సీ, టెట్ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ, పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ 6మంది అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సూచించింది. టెట్, డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీర్పును స్వాగతించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. 1200 పరీక్షా కేంద్రాల్లో 4.5 లక్షల మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. అయితే, కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.