Chandrababu on Rajadhani: ఏపీని వైసీపీ విధ్వంసం చేసింది : సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Chandrababu on Rajadhani: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో భారీగా విధ్వంసం జరిగిందని ఆరోపించారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
గత వైసీపీ సర్కారు రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఈ ఏడాదిలో ఏపీకి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఏడుగురు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు చెప్పారు. సూర్యఘర్ కింద 35లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించామన్నారు. సూర్యఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10వేల కుటుంబాలకు కరెంట్ ఇస్తామన్నారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. కూటమి ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందన్నారు. పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్నారు. రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీకి విన్నవించినట్లు తెలిపారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీ హబ్గా ఏపీ..
ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేసిన రాజ్నాథ్సింగ్కు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపాను. జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్లో 6వేల ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. క్లస్టర్లో మిసైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరామన్నారు. లేపాక్షి-మడకశిర క్లస్టర్లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
విశాఖపట్నం- అనకాపల్లి క్లస్టర్లో నేవల్ ఎక్స్పర్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కర్నూలు- ఓర్వకల్లు క్లస్టర్లో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెట్స్ తయారీ చేయాలని వివరించినట్లు తెలపారు. తిరుపతి ఐఐటీలో డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పెట్టాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏపీలో సైనిక కంటోన్మెంట్ పెట్టాలని కోరితే పరిశీలిస్తామన్నారు. కుసుమ్ కింద 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్గా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతుందని చెప్పారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.80వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చని తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తామన్నారు. కేంద్రం అనుమతి ఇవ్వగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు. నిధులు ఇవ్వాలని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ను కోరామని చంద్రబాబు తెలిపారు.