GHMC Assistant Town Planner: రూ.8లక్షలు డిమాండ్.. రైడ్ లో ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ టౌన్ ప్లానర్

GHMC Assistant Town Planner by ACB Raids: హైదరాబాద్లోని సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠల్ రావుపై వెంకట్ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్కు చెందిన వెంకట్ రావు భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సి సర్టిఫికెట్ నిమిత్తం జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు వెంకట్ రావు వద్ద నుంచి రూ.8 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు.
విఠల్ రావు నాలుగు లక్షల రూపాయలను సఫిల్ గూడ వద్ద ప్రభుత్వ వాహనంలోనే తీసుకున్నట్లు ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు. దీంతో మేడిపల్లిలోని ఆయన నివాసంతో పాటు నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు కోసం అధికారులు సోదాలు నిర్వహించారు. 4 లక్షల రూపాయల కోసం ఏసీపీ విఠల్ రావు ఒత్తిడి తీసుకువచ్చినట్లు బాధితుడు తెలిపాడు. మిగిలిన డబ్బుల కోసం విఠల్ రావు భవన నిర్మాణ అనుమతుల ఫైళ్లను తిరస్కరించినట్లు బాధితుడు తెలిపాడు.