Published On:

Uttam Kumar Reddy: ఇందిరా గాంధీ లాంటి వాళ్లే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు: మంత్రి ఉత్తమ్!

Uttam Kumar Reddy: ఇందిరా గాంధీ లాంటి వాళ్లే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు: మంత్రి ఉత్తమ్!

Uttam Kumar Reddy fires on BRS: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు ఉన్నట్లు తేల్చడానికి దేశంలోనే పేరుగాంచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేశామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ తప్పు చేయకుంటే నోటీసు ఇవ్వగానే అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. నోటీసు ఇవ్వగానే కమిషన్ తప్పుబడుతూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇందిరా గాంధీ లాంటి వాళ్లే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. నోటీసులు ఇచ్చిన తర్వాత జ్యుడీషియల్ కమిషన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేశామన్నారు.

 

బాంబులు వేశారని చెబుతున్నారని, అప్పడు మీరే ప్రభుత్వంలో ఉన్నారని గుర్తుచేశారు. మేడిగడ్డపై బాంబులు వేస్తే అప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని తెల్ల ఏనుగుతో పొల్చుతూ కాగ్ నివేదికలో పేర్కొందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకునేందుకు మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతం మార్చారని దుయ్యబట్టారు. డీపీఆర్‌లో పేర్కొన్న ప్రదేశం కాకుండా మరోచోట ప్రాజెక్టు కట్టారని పేర్కొన్నారు. నాలుగు రెట్లు వ్యయం పెరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనపు ఆయకట్టు నామమాత్రంగా పెరిగిందని విమర్శించారు.

 

కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టు ప్రాంతం మార్చారని, కాళేశ్వరం తెల్ల ఏనుగుగా మారబోతోందని కేంద్ర సంస్థలు చెప్పాయన్నారు. బీఆర్ఎస్ ఎంపీల మద్దతుతోనే ఎన్డీఎస్‌ఏ చట్టం వచ్చిందన్నారు. కాళేశ్వరం డీపీఆర్, రీడిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఏన్డీఎస్ఏ చెప్పిందన్నారు. ప్రాజెక్టు పునాదుల్లోనే ఎన్నో లోపాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని వివరించారు. కూలిపోయిన ప్రాజెక్టును అద్భుతమని నిస్సిగ్గుగా మాట్లాడతున్నారని దుయ్యబట్టారు. జ్యుడీషియల్ కమిషన్ ముందు హాజరై వాళ్ల వాదన ఏంటో వినిపించాలని మంత్రి ఉత్తమ్ అన్నారు.

 

ఇవి కూడా చదవండి: