KTR Comments on BJP, Congress: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్.. దెయ్యాన్ని వదిలిస్తాం: కేటీఆర్!

KTR Sensational Comments on BJP & Congress: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖపై తెలంగాణ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. ఈ సంద్భంగా సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ పేరు ఉందని, ఈడీ ఛార్జ్ షీట్ లో సీఎం పేరు ఉండటం తెలంగాణకు అవమానమని చెప్పారు. రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదని అన్నారు. యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ కు బ్యాగ్ మాన్ అనే పేరొచ్చిందని ఎద్దేవా చేశారు. రూ. 50 కోట్లతో పీసీసీ చీఫ్ పదవి కొన్నట్టు కాంగ్రెస్ వాళ్లే చెప్తున్నారని పేర్కొన్నారు.
మూటలు మోసి రేవంత్ పదవి తెచ్చుకున్నారని కోమటిరెడ్డే అన్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు మూటలు మోసి పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. తనను తాను కాపాడుకోవడానికి ఢిల్లీ నేతల కాళ్లు రేవంత్ పట్టుకుంటున్నారని విమర్శించారు. నిజాయితీ, నైతికత ఉంటే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదని.. మూటల ముఖ్యమంత్రి అన్నారు. నిన్న రాత్రి చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేయొద్దని ఈడీ చెప్పాలని వేడుకున్నారని విమర్శించారు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు రూటు అంటూ ఎద్దేవా చేశారు. మూటలు మోసే పీసీసీ చీఫ్ పదవి, సీఎం పదవి తెచ్చుకున్నారని.. 16 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లి అరుదైన రికార్డ్ సాధించారని అన్నారు.
రేవంత్ పాలనలో మా మీద నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు.. ఢిల్లీకి చందాలు అంటూ మండిపడ్డారు. అవినీతి సీఎంను ఎందుకు కొనసాగిస్తున్నారో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే అవినీతి ఉందన్నారు. పొంగులేటి ఇంట్లో తనిఖీల వివరాలు ఎందుకు బయటపెట్టలేదు.. కాంగ్రెస్ నేతలను బీజేపీ నాయకులు ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రూ. 45 కోట్లు వచ్చాయి.. ఈ స్కామ్ లో నిందితులపై చర్యలు ఎందుకు లేవో చెప్పాలన్నారు. తెలంగాణలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని మోదీనే చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ చేస్తున్నాయని విమర్శించారు. ఎవరితో ఎవరు కుమ్మక్కయ్యారో ప్రజలు ఆలోచించాలని కోరారు.
అన్ని స్కాముల్లో కాంగ్రెస్ ను బీజేపీ కాపాడుతోందన్నారు. రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీది మౌనముని పాత్ర పోషిస్తోందని చెప్పారు. హెరాల్డ్ కేసులో రేవంత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెలరోజుల్లో చర్యలు తీసుకోకపోతే మా కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డేనని.. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ అని.. దెయ్యాన్ని, శనిని వదిలించడమే తమ పని అన్నారు. బీఆర్ఎస్ లో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని వెల్లడించారు. తమ నాయకుడికి సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చని వివరించారు. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను బయట మాట్లాడకపోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. పార్టీలో అందరం కార్యకర్తలమేనని.. అందరం సమానమేనని చెప్పారు. తమ పార్టీలో రేవంత్ కోవర్టులు ఉన్నారని తెలిపారు.