TPCC New Program: టీపీసీసీ మరో వినూత్న కార్యక్రమం.. సమస్యల పరిష్కారానికే!

TPCC New Program in Gandhi Bhavan: టీపీసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యల పరిష్కారం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హైదరాబాద్లో ఉన్న గాంధీభవన్లో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేలా ఈ కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి గాంధీభవన్లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండనున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతి రోజు ఇద్దరు ప్రజా ప్రతినిధుల అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే తొలుత రోజుకు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు ఉంటారు. వీరు గాంధీ భవన్లో నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వంతో పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు.
ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు వరసగా జూన్ 10 నుంచి ప్రతి రోజు ఇద్దరు చొప్పున గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు. నేటి నుంచి ప్రజా వినియోగ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరుకానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు కార్యాచరణ చేపట్టనున్నారు. ఇప్పటికే మంత్రులతో ‘ముఖాముఖి’ కార్యక్రమాన్ని విజయవంతంగా టీపీసీసీ నిర్వహించింది.