Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను ఆపారు. లుకౌట్ నోటీసులు అమలులో ఉండటంతో, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ వద్ద పాస్ పోర్ట్ స్కానింగ్ సమయంలో అధికారులకు సమాచారం వెళ్లింది. దీంతో ఆయన ఇమ్మిగ్రేషన్ వివరాలను ప్రాసెస్ చేసిన అనంతరం.. ఇంటికి వెళ్లేందుకు ఆయనకు అనుమతి లభించింది.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా సిట్ గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇవాళ సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో ఏ1గా చేర్చారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రభాకర్ రావును విచారించాల్సి ఉంది. ఈ మేరకు నేడు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో ఆయనను విచారించనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.