TGSRTC: తెలంగాణలో బస్ పాస్ రేట్లు పెంపు.. నేటి నుంచే అమలు
Bus Pass Prices: తెలంగాణ ఆర్టీసీ మరోసారి బస్ పాస్ రేట్లను పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. జనరల్ బస్ పాస్ ధరలతో పాటు, స్టూడెంట్ బస్ పాస్ ఛార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. దాదాపు 20 శాతానికిపైగా ఛార్జీలను పెంచేసింది.
కాగా ఇప్పటివరకు రూ. 1150గా ఉన్న సిటీ ఆర్డీనరి పాస్ ధర తాజాగా రూ. 1400కి చేరింది. ఇక రూ. 1300 గా ఉన్న మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధర రూ. 1600కి పెరిగింది. ఇక రూ. 1450 రూపాయలుగా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధర రూ. 1800 అయింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచింది. కాగా బస్ పాస్ రేట్లు పెరగడంతో సగటు పౌరులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతున్నారు. అయితే తెలంగాణలో బస్ పాస్ ధరలను కొద్ది నెలల క్రితమే ఆర్టీసీ పెంచింది. తాజాగా మరోసారి ప్రయాణికులపై ఛార్జీలను బాదింది.