Notices to KCR: కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు!

Kaleshwaram Inquiry Commission issues notices to former CM KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తోపాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ముగ్గురికి 15 రోజులు గడువు ఇచ్చింది. కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. జూన్ 5వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 6న హరీశ్రావు, 9న ఈటల రాజేందర్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరీశ్రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.
మేడిగడ్డ బ్యారేజీ కంగిన నేపథ్యంలో అన్నారం, సందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటైంది. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీకంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది.
ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా రాష్ట్రం ప్రభుత్వం ఏడు సార్లు కమిషన్ గడువును పొడిగించింది. గత నెలాఖరులో ఒక నెల మాత్రమే గడువు పొడిగించింది. దీన్ని ప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తికావాలి. ఈ నెల 21 లేదా 22న జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారనే ప్రచారం జరిగింది. విచారణలో సీనియర్ ఇంజినీర్లు అధికారుల్లో ఎక్కువ మంది గత సీఎం కేసీఆర్ సమక్షంలో నిర్ణయాలు జరిగాయని, ఆయన ఆదేశాల మేరకు పలు నిర్ణయాలను అమలు చేశామని చెప్పిన నేపథ్యంలో వీటిపై కేసీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్ అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలనే నిర్ణయంతో కమిషన్ ఉన్నట్లు సమాచారం.