SpaceX: నేడు నింగిలోకి శుభాంశు శుక్లా.. సాయంత్రం రాకెట్ ప్రయోగం
SpaceX Falcon9 Rocket: ఇండియన్ ఏవియేషన్ గ్రూప్ కెప్టెన్, గగన్ యాన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా నేడు అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ తో కలిసి నింగిలోకి వెళ్లనున్నారు.
యాక్సియోమ్ స్పేస్ కంపెనీ యాక్సియోమ్-4 పేరుతో చేపట్టిన కమర్షియల్ మిషన్ లో భాగంగా శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఇప్పటికే నాలుగుసార్లు ఈ మిషన్ వాయిదా పడింది. కాగా ఆదివారం జరగాల్సిన రాకెట్ ప్రయోగం ప్రతికూల వాతావరణంతో నిన్నటికి వాయిదా వేశారు. నిన్న కూడా వాతావరణం బాగలేకపోవడంతో నేడు ప్రయోగం చేపట్టనున్నట్టు నాసా ప్రకటించింది. అయితే ఇవాళ కూడా వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కాగా ఇవాళ రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవేళ ఆఖరి నిమిషంలో ప్రయోగం వాయిదా పడితే, రేపు ఉదయం రాకెట్ ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని యాక్సియోమ్ స్పేస్ కంపెనీ మిషన్ సర్వీసెస్ చీఫ్ అలెన్ ఫ్లించ్ వెల్లడించారు. ఈ మిషన్ లో స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్, క్రూ డ్రాగన్ మాడ్యూల్ ను ఉపయోగిస్తుండగా.. రాకెట్ బూస్టర్ లో ఆక్సిజన్ లీకేజీ గుర్తించినట్టు స్పేస్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ విలియమ్ గెర్ స్టెన్మీర్ వెల్లడించారు. అలాగే రాకెట్ దిశను మార్చేందుకు కీలకమైన థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్ పరికరంలో సమస్య ఉందన్నారు. అన్ని సమస్యలను నిన్న సాయంత్రానికి పూర్తి చేశారు. ఈ మిషన్ విజయవంతం అయితే రాకేశ్ తర్వాత నింగిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టిస్తారు.