Accident: విషాదంగా ముగిసిన విహారయాత్ర.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఉంటున్న ఏడుగురు స్నేహితులు నిన్న నాగార్జునసాగర్ చూసేందుకు కారులో వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా.. నాగార్జున సాగర్ హైవేపై మాల్ వద్ద వారి కారును బస్సు ఢీకొంది.
దీంతో ఘటనా స్థలిలోనే ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపారు. మృతులను మహబూబ్ నగర్ కు చెందిన సాయితేజ, పవన్, రాఘవేంద్రగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.