Harish Rao: మహారాష్ట్ర ఒప్పుకోలేదు.. కాలేశ్వరంపై హరీష్ రావు వివరణ
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతి కాపీలను కమిషన్కు హరీష్ రావు అందించారు. సుమారు 40 నిమిషాలపాటు హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. కేంద్ర సర్వే సంస్థ వ్యాప్కోస్, టెక్నికల్ కమిటీ, హై పవర్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీశ్రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని ఆయన తెలిపారు. తమ్మిడిహట్టినుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చాలా సేపు ప్రశ్నించారని.. తమ్మిడిహట్టి వద్దే కట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పానన్నారు. దీనిపై అనాడే అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రిని కోరామని.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఐదారు సమావేశాలు జరిగాయన్నారు.
కేసీఆరే స్వయంగా మహారాష్ట్ర వెళ్లి.. సీఎం ఫడణవీస్కు చెప్పే ప్రయత్నం చేశారని హరీష్ రావు అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి.. బీజేపీ ప్రభుత్వం వస్తే.. మళ్లీ సంప్రదించామన్నారు. తమ్మిడిహట్టి వద్ద అనుమతించాలని.. ఎంత నష్టపరిహారమైనా ఇస్తామని స్పష్టంగా చెప్పామన్నారు. మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే కాళేశ్వరం రీ డిజైన్ చేశామని హరీష్రావు స్పష్టం చేశారు.