Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు ఊరట

Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభాకర్ రావుకు పాస్ పోర్టు ఇవ్వాలని సూచించింది. పాస్ పోర్టు వచ్చిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు భారత్ కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తాను భారత్ కు తిరిగి వస్తానని కోరుతూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత ఆయనకు బెయిల్ ఇచ్చేందకు మే 2న హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును ప్రభాకర్ రావు మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలేనని, చికిత్స నిమిత్తమే అమెరికా వెళ్లానని కోర్టుకు వివరించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దేశానికి తిరిగి వస్తానని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు .ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.