Cabinet Meeting: జూన్ 5న తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్వత్రా ఉత్కంఠ
Telangana: ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే కేబినెట్ భేటీలో ఏఏ అంశాలపై చర్చ జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజీవ్ యువవికాసం, వానాకాలంలో సాగుచేసే పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోళ్లతో పాటు కాళేశ్వరం అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ పై సమావేశంలో చర్చ జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. కాగా నివేదికలోని అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు వివరించినట్టు సమచారం. అయితే ఈ విషయంలో మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఏదైనా నిర్ణయం వస్తుందా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.