Published On:

Congress vs BRS : కేటీఆర్, హరీశ్‌రావులకు మంత్రి జూపల్లి సవాల్

Congress vs BRS : కేటీఆర్, హరీశ్‌రావులకు మంత్రి జూపల్లి సవాల్

Jupally Krishna Rao fires on KTR and Harish Rao : ప్రపంచ సుందరీమణుల పోటీలకు చాలా దేశాలతో పోటి పడి హైదరాబాద్ అవకాశం దక్కించుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పోటీల నిర్వహణతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. మంగళవారం జూపల్లి సచివాలయం మీడియా పాయింట్ మాట్లాడారు. ప్రపంచ సుందరీమణుల పోటీలు విజయవంతమయ్యాయని, ఇందుకు సహకరించిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ సుందరీమణుల పోటీల ద్వారా తెలంగాణ టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేశామని తెలిపారు. అంతర్జాతీయ పోటీలను చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం చేయగలదని నిరూపించామని పేర్కొన్నారు. ప్రపంచ సుందరీమణుల పోటీల నిర్వహణతో ఒలంపిక్స్ జరపగలమని నిరూపించామన్నారు. ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

30 తులాలు కాదు.. మూడు గ్రాములు కూడా ఇవ్వలేదు..
ప్రపంచ సుందరీమణుల పోటీలకు రూ.31కోట్లు ఖర్చు అయిందని, స్పాన్సర్ల ద్వారా రూ.21 కోట్లు వచ్చాయని తెలిపారు. మరో రూ.12 కోట్లు కమిట్‌మెంట్ ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రపంచ సుందరీమణుల పోటీల కోసం ప్రభుత్వానికి రూ.10 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. విపక్షాల విమర్శలను చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదన్నారు. ఒక్కో ప్రపంచ కంటెస్టెంట్‌కు 30 తులాలు కాదని, మూడు గ్రాములు కూడా ఇవ్వలేదని చెప్పారు. హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు అబద్ధం చెప్పలేదన్నారు. విపక్షాలు ఏం మాట్లాడుతారో చూద్దామని ఇన్ని రోజులు వేచి చూశామన్నారు. చౌమల్లా ప్యాలెస్‌లో విందు ప్లేట్‌కు రూ.లక్ష ఖర్చు అనేది అవాస్తవమన్నారు. ఒక్కో ప్లేట్‌కు రూ.8,200 మాత్రమే ఖర్చు అయిందని మంత్రి వెల్లడించారు.

 

కేటీఆర్, హరీశ్‌రావు సవాల్‌కు సిద్ధమా? : మంత్రి పొన్నం
తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచి విపక్షాలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అంతర్జాతీయ అతిథులు తెలంగాణకు వస్తే విమర్శలు చేయడం తగదన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్ చేస్తున్నానని, దీనిపై చర్చకు ఎక్కడకు రావాలి.. తెలంగాణ భవన్‌కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలో చెప్పాలన్నారు. రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలన్నారు. ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేకపోతే ముక్కు నెలకు రాయాలని సవాల్ చేశారు.

 

వారం రోజులు సమయం ఇస్తున్నా..
కేటీఆర్, హరీశ్‌రావు చెప్పిన సమయానికి చర్చకు ఎక్కడికైనా వస్తానని, దీనికి వారం రోజులు సమయం ఇస్తున్నానని మంత్రి పొన్నం అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని వారికి మరోసారి మంత్రి సవాల్ చేశారు.

ఇవి కూడా చదవండి: