Published On:

YS Jagan Mohan Reddy : రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పింది : వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy : రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పింది : వైఎస్ జగన్

YS Jagan visits the affected families : రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఏపీ అదుపు తప్పిందని, పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. మంగళవారం తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

 

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు, వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రెడ్‌బుక్‌తో వేధించి హింసిస్తున్నారని ఆరోపించారు. పోలీస్‌ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమని చెప్పారు.

 

తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనార్టీల ముగ్గురు పిల్లలు దెబ్బలు తిన్నారని, రాకేష్ హైదరాబాద్‌లో జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. యువకుడు తెనాలిలో ఉండడం లేదని చెప్పారు. పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడని పేర్కొన్నారు. రాకేష్‌ను చూడడానికి అతడి స్నేహితులు వచ్చారని, వాళ్లు మంగళగిరి నుంచి వచ్చారని తెలిపారు. జాన్‌ విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌. బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉందని పేర్కొన్నారు.

 

ఐతానగర్‌లో సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గొడవ పడుతుంటే యువకులు అడ్డుకున్నారని తెలిపారు. గొడవపడుతున్న కానిస్టేబుల్‌ను వీళ్లు ప్రశ్నించారని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ను ప్రశ్నించడం వీళ్లు చేసిన తప్పా?. అని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 24వ తేదీన కానిస్టేబుల్‌ను యువకులు ప్రశ్నించారని తెలిపారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్‌ విక్టర్‌, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారని తెలిపారు. తెనాలి పోలీస్ స్టేషన్‌లో పడేసి కొట్టారని మండిపడ్డారు. ఏప్రిల్‌ 26వ తేదీన ఐతానగర్‌లో నడిరోడ్డుపై పడేసి ముగ్గురిని చితకబాదారని ఆరోపించారు.

 

కొట్టవద్దని వేడుకున్నా వదల్లేదని చెప్పారు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసికొట్టారని చెప్పారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారని తెలిపారు. వ్యవహారంలో తెనాలి టూటౌన్‌ సీఐ, మరో పీఎస్‌ సీఐ ఉన్నారని పేర్కొన్నారు. ఇద్దరు వీఆర్వో సమక్షంలో పంచనామా రాసుకున్నారని తెలిపారు. అరెస్టు చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని జగన్‌ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: