Chandrababu: సీబీఎన్ ఉన్నంత వరకు రాష్ట్రంలో క్రిమినల్స్కు చోటులేదు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

AP CM Chandrababu sensational Comments: శాంతిభద్రతలు ఉన్న చోటనే అభివృద్ధి జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు ఏఐ హ్యాకథాన్ను సీఎం ప్రారంభించారు. ఐటీ కంపెనీలు, ఏఐ నిపుణులతో ముఖాముఖి అనంతరం ఆయన మాట్లాడారు.
అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ..
ఐటీ వల్ల దేశంలో అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ రూపుదిద్దుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రౌడీయిజం, నక్సలిజం, స్మగ్లర్లను కట్టడి చేశామని గుర్తుచేశారు. సీబీఎన్ ఉన్నంత వరకు నేరస్థులకు చోటు లేదని స్పష్టం చేశారు. సాంకేతికతతోపాటు సంఘ విద్రోహశక్తులపై దృష్టి పెట్టామని తెలిపారు. క్వాంటం వ్యాలీ కింద ఏఐకి ప్రాధాన్యం ఇచ్చామని, ఏఐ ద్వారా ప్రపంచవ్యాప్తగా తెలుగువారి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనేది అపోహ..
ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమే అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచి ధ్రువపత్రాలు పొందొచ్చని తెలిపారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేస్తే ప్రపంచాన్ని జయించే పరిస్థితి వస్తుందన్నారు. దేశంలో మొదటి సారిగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం తెలిపారు.