Visakhapatnam: విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు మరణశిక్ష విధింపు

Visakhapatnam court: ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజుకు విశాఖ కోర్టు మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చిన్నారితోపాటు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్యచేశాడు. జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. దొరికిన వారిని దొరికినట్టు నరికిపారేశాడు.
హంతకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బొమ్మిడి రమణ (63), ఉషారాణి (35), అల్లూరి రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), బొమ్మిడి ఉదయ్ (2), ఉర్విష (6 నెలలు) ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఘటన తర్వాత నిందితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.